విదేశాల నుంచి వచ్చిన 800 మంది పాసుపోర్టులు సీజ్‌..

రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ఎవరికైనా అత్యవసర సేవలకు పోలీసు సహాయం కావాలంటే వెంటనే కరోనా ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ నెం. 9490617234కు సమాచారం అందించాలన్నారు. గుండెపోటు గురైనప్పుడు, డయాలిసిస్‌ అవసరం ఉన్న రోగులు వారికి వైద్య చికిత్సలు అవసరం ఉన్నప్పుడు వెంటనే ఈ కంట్రోల్‌ రూమ్‌ నెంబరుకు సంప్రదించాలని రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ విజ్ఞప్తి చేశారు. అదే రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ఇప్పటి వరకు మొత్తం 1989 మంది అనుమానితులను గుర్తించగా అందులో 1740 మందిని వ్యక్తిగతంగా పరిశీలించారు. అందులో ముగ్గురికి మాత్రమే పాజిటివ్‌ వచ్చిందన్నారు. 


మిగత 1664 మంది క్వారంటైన్‌లో ఉన్నారని సీపీ మహేష్‌ భగవత్‌ వివరించారు. దాదాపు విదేశాల నుంచి వచ్చిన దాదాపు 800 మందికి చెందిన పాసుపోర్టులను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలు ఏలాంటి భయాందోళనకు గురికావద్దని, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలందరూ సహకరించాలన్నారు. లాక్‌డౌన్‌ కాలంలో ప్రజలెవ్వరు ఇంటి నుంచి బయటికి రావద్దన్నారు. అదే విధంగా నిత్యావసరాల సరకులు తెచ్చుకునే సమయంలో కచ్చితంగా సామాజిక దూరాన్ని 3 నుంచి 6 అడుగులు దూరాన్ని పాటించాలన్నారు.